Kumari Aunty : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ముంపు బాధితులను ఆదుకునేందుకు రెండు ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తాజాగా కుమారి అంటీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళం అందజేశారు. బుధవారం (సెప్టెంబర్ 18) కుమారీ ఆంటీ తన కుమార్తెతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి రూ.50 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కుమారీ ఆంటీని ఘనంగా సన్మానించారు. ఆమెకు శాలువా కప్పి ధన్యవాదాలు తెలిపారు. కాగా కొన్ని నెలల క్రితం ట్రాఫిక్ క్లియరెన్స్ లో భాగంగా కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ ను పోలీసులు తొలగించారు. దీంతో ఆమె హోటల్ బిజినెస్ బాగా దెబ్బతింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని మరీ కుమారీ ఆంటీ ఫుడ్ హోటల్ ను ఓపెన్ చేయించారు.
Kumari Aunty Donate..
కుమారి ఆంటీ పూర్తి పేరు దాసరి సాయి కుమారి. హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తోన్న ఆమె పేరు గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తోంది. ‘ మీది రూ.1000 అయింది..రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ కుమారీ ఆంటీ(Kumari Aunty) చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో బాగా వైరలైపోయాయి. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ ముందు జనం క్యూ కట్టారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తి, పోలీసులు రంగ ప్రవేశం చేసి కుమారీ ఆంటీ హోటల్ ను క్లోజ్ చేయించాల్సి వచ్చింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో మళ్లీ ఆమె బిజినెస్ ఓపెన్ అయ్యింది. దీని తర్వాత కుమారీ ఆంటీ పేరు బాగా మార్మోగిపోయింది. పలు టీవీ షోల్లోనూ సందడి చేసిందామె. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ గానూ వస్తుందని ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు.
Also Read : Jani Master : జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు