Krishna Vamsi: ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా… కృష్ణవంశీ దర్శకత్వంలో మహేశ్ బాబు, సోనాలీ బింద్రే జంటగా నటించిన ‘మురారి’ సినిమాను రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేశ్ బాబు… ప్రస్తుతం దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమౌతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేకోవర్ కోసం కొత్త హెయిర్ స్టైల్ తో పాటు ఫిట్ నెస్ కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. రాజమౌళితో సినిమా అంటే ఏళ్ళ తరబడి షూటింగ్ నడుస్తుందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.
Krishna Vamsi Comment
ఈ నేపథ్యంలో 23 ఏళ్ళ క్రిందట వచ్చిన మురారి సినిమాను రీ రిలీజ్ చేసి తమదైన శైలిలో అభిమాన హీరో పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.ఈ వేడుకల్లో భాగంగా పలువురు యువతీ యువకులు థియేటర్లలో పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే థియేటర్లలో అభిమానులు చేసుకున్న పెళ్లిళ్ళపై చిత్ర దర్శకుడు కృష్ణవంశీ(Krishna Vamsi) అసహనం వ్యక్తం చేశారు. ఇలా చేయడం సరి కాదన్నారు. ‘‘మన సంస్కృతి, సంప్రదాయాలను దుర్వినియోగం, అపహాస్యం చేయొద్దు. అలాగే అవమానించొద్దు. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.దయచేసి ఇలాంటి పనులు చేయకండి’’ అని ఆయన పోస్ట్ పెట్టారు. అంతేకాదు తెలిసీ తెలియక వాళ్లు అలా చేసి ఉంటారని.. వారికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
కృష్ణవంశీ(Krishna Vamsi) తెరకెక్కించిన కుటుంబ కథా చిత్రం ‘మురారి’. మహేశ్బాబు హీరోగా సోనాలీబింద్రే కథానాయికగా నటించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో పలు థియేటర్లలో 100 రోజులాడింది. 23 ఏళ్ల తర్వాత తాజాగా దీనిని 4K వెర్షన్ లో రీ రిలీజ్ చేశారు. మహేశ్ పుట్టినరోజు పురస్కరించుకుని ఆగస్టు 9న తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో విడుదల చేయగా.. అభిమానులు సందడి చేశారు. ఇదిలా ఉండగా.. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ‘అలనాటి రామచంద్రుడు’ పాటకు యువత నుంచి మరోసారి విశేష స్పందన లభించింది. ఆ పాట ప్లే అవుతున్న సమయంలో పలు థియేటర్లలో యువతీయువకులు పెళ్లి చేసుకుంటున్న విజువల్స్ సోషల్మీడియాలో వైరల్గా మారాయి. కృష్ణవంశీని ట్యాగ్ చేస్తూ ఆయా వీడియోలను పలువురు నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ‘కొత్త జంటలను ఆశీర్వదించండి’ అని పేర్కొంటున్నారు. అలా ఓ నెటిజన్ షేర్ చేసిన వీడియోపై కృష్ణవంశీ(Krishna Vamsi) తాజాగా స్పందించారు.
మరోవైపు, రీ రిలీజ్లోనూ ‘మురారి’ రికార్డులు సృష్టించిందని పలువురు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. దాదాపు రూ.5 కోట్ల వరకూ వసూలు చేసినట్లు పేర్కొన్నారు. తమ చిత్రానికి విశేష ఆదరణ చూపినందుకు కృష్ణవంశీ అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ‘‘మరోసారి ‘మురారి’ని ఇంతలా ఆదరించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, ముఖ్యంగా మహేశ్ ఇంకా ఆయన అభిమానులతోపాటు చిత్రబృందానికి పేరుపేరునా కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.
Also Read : Bigg Boss Telugu 8 Promo: ‘బిగ్బాస్ తెలుగు సీజన్ 8’ కొత్త ప్రోమో వచ్చేసింది !