Darshan Thoogudeepa: తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకరంగా మెసేజ్ లు పంపిచారనే నెపంతో అభిమాని రేణుకాస్వామిని అతి దారుణంగా హత్యచేసిన జైలు శిక్ష అనుభవిస్తున్న శాండల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ తూగదీపదే(Darshan Thoogudeepa) అక్కడ కూడా విలాసమైన జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్న దర్శన్… జైలు గార్డెన్ లో ఓ చేతిలో కాఫీ కప్పు, మరో చేతిలో సిగరెట్ తాగుతూ రిలాక్స్ అవుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దర్శన్ తో పాటు రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగ, మరో ఖైదీ మేనేజర్ నాగరాజ్ ఉన్నారు. దీనితో జైల్లో నిబంధనలపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీనితో హత్యకేసు నిందితుడు దర్శన్(Darshan Thoogudeepa) విషయంలో జైళ్లశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దర్శన్ ను పరప్పన ఆగ్రహార జైలు నుంచి బళ్లారి జైలుకు తరలించాలని జైళ్ల శాఖ నిర్ణయించింది. ఈమేరకు బెంగళూరు 24వ ఏసీఎంఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దర్శన్ ను బళ్లారి జైలుకు తరలించేందుకు కోర్టు కూడా అనుమతి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు మూడు రోజుల్లో దర్శన్ను బళ్లారికి తరించనున్నట్లు సమాచారం. భవిష్యత్లో విచారణ నిమిత్తం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బళ్లారి జైలు నుంచే కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్లు సమాచారం.
Darshan Thoogudeepa – దర్శన్ రాచమర్యాదల కేసుపై దర్యాప్తు
దర్శన్(Darshan Thoogudeepa)కు రాచమర్యాదులు అందిన ఘటనలో పరప్పన అగ్రహార పోలీస్స్టేషన్లో మూడు కేసులు నమోదు కాగా రెండింటిలో దర్శన్ మొదటి నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల దర్యాప్తునకు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సారా ఫాతిమా మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బేగూరు పోలీస్స్టేషన్ సీఐ క్రిష్ణకుమార్ దర్యాప్తు ప్రారంభించనున్నారు. జైలు లాన్లో కూర్చుని దర్శన్ రౌడీషిటర్ ఇతర ఖైదీలకు ఆ ఏర్పాటు ఎవరు చేశారు ?, సిగరెట్లు జైల్లోకి ఎలా వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తారు. ఈ దృశ్యాలు ఫొటో, వీడియో ఎలా తీశారనే విషయంపై హుళిమావు సీఐ దర్యాప్తు చేస్తారు. జైలు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం తదితర అంశాలపై మూడవ కేసును ఎల్రక్టానిక్ సిటీ పోలీస్స్టేషన్ ఏసీపీ మంజునాథ్ దర్యాప్తు చేస్తారు.
దర్శన్ ఉదంతంపై సీఎం సమీక్ష
దర్శన్, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణలకు జైలులో రాచ మర్యాదలు దక్కుతున్న అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రులతో సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం హోంమంత్రి పరమేశ్వర్ ముఖ్యమంత్రిని కలిసి జైల్లో జరుగుతున్న అక్రమాలు, లోపాల గురించి వివరించారు. ఇప్పటికే ఉన్నతాధికారులతో కలిపి మొత్తం 9 మందిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఐపీఎస్ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీ జరుగుతోందని చెప్పారు. ఆలోపు కోర్టు అనుమతి తీసుకుని దర్శన్ను వేరే జైలుకి తరలించే ఏర్పాటు చేస్తామన్నారు. కోర్టు అనుమతిస్తే దర్శన్ను బళ్లారి లేదా హిండలగా జైలుకి తరలించే అవకాశాలు ఉన్నాయి.
తనిఖీకి ఐపీఎస్ అధికారులతో కమిటీ
పరప్పన అగ్రహార జైల్లో దర్శన్(Darshan Thoogudeepa), ప్రజ్వల్ రేవణ్ణ, రౌడీ షీటర్లకు రాచ మర్యాదలు ఇస్తున్న విషయానికి సంబంధించి తనిఖీ చేయడానికి ఐపీఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని హోంమంత్రి జీ పరమేశ్వర్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జైల్లో దర్శన్, ఇతర ఖైదీలు ఒక బ్యారక్ నుంచి మరో బ్యారక్లోకి తిరగడానికి అవకాశం కలి్పంచినట్టు సీసీటీవీలో స్పష్టంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న పలు జైళ్లలో ఇదే పరిస్థితి ఉందన్నారు.
జైలును సందర్శించిన పోలీస్ కమిషనర్ !
బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ పరప్పన అగ్రహార జైలును సందర్శించారు. జైలులో గంజాయి, మద్యం, సిగరెట్లు, మొబైళ్లు అన్నీ ఇస్తున్నారని ఇటీవల పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలై వచ్చిన ఒక ఖైదీ మీడియా ముందు వెల్లడించాడు. దీంతో కమిషనర్ దయానంద్ జైలుని సందర్శించారు. ఫొటోలు, వీడియోలపై జైలు అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
Also Read : Kangana Ranaut: కంగన రనౌత్ ‘ఎమర్జెన్సీ’ మేకర్స్ కు లీగల్ నోటీసులు !